06-12-2024 01:33:05 AM
శేరిలింగంపల్లి, డిసెంబర్ 5: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తన విధులకు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు 20 మంది ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన నేపథ్యంలో అరెస్ట్ జరిగింది. అరెస్ట్కు ముందు మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే అరెస్ట్ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు.దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మరోవైపు ఎమ్మెల్యేపై పోలీసు లు బీఎన్ఎస్ 57, 126 (2), 127 (2), 132, 224, 333, 451 (3), 191 (2), ఆర్డబ్లూ 190, ఆర్డబ్ల్యూ 3 (5) సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎక్స్ వేదికగా హరీశ్రావు ఆగ్రహం
ఎమ్మెల్యే అరెస్ట్పై మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో కొనసాగుతున్నది ఇందిరమ్మ రాజ్యమా ? లేదా ఎమర్జెన్సీ పాలనా? అని ప్రశ్నించారు. దుర్మార్గాలను ప్రశ్నిస్తే, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో పాటు తననూ, బీఆర్ఎస్ నాయకులను పోలీస్ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
అరెస్టును ఖండించిన కవిత..
బీఆర్ఎస్ నేతల అరెస్టులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. ‘ఇది ప్రజా పాలన కాదు. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన’ అని మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నేతలను తక్షణం పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు