04-05-2025 12:26:33 AM
మేడ్చల్, మే 3 (విజయక్రాంతి): కీసర మండలం చీర్యాల గ్రామానికి ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ నాయకులు, స్థానికులు నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు.
దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ చేర్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. శనివారం చీర్యాలలో బస్సు సర్వీసును నియోజకవర్గ ఇన్చార్జి వజ్రాస్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వజ్రేస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రజలు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలన్నారు. బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు చీర్యాల నుంచి సికింద్రాబాద్ వరకు నడుస్తుంది.