22-08-2025 11:14:14 PM
ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
చిరు ప్రజాసేవ సమితి అధ్యక్షులు కొండ సైదులు గౌడ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రజలకు అందించే సేవలకు చిరునామాగా ప్రముఖ నటుడు పద్మ విభూషణ్ చిరంజీవి నిలుస్తారని చిరంజీవి ప్రజా సేవా సమితి మండల అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ అన్నారు.మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో చిరంజీవి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు మెటీరియల్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిరంజీవి కేవలం నటుడుగానే కాక ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోతాడని తెలిపారు.
నటుడుగా రాణిస్తూ మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రక్తదానం, నేత్రదానం లాంటి సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తూ కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ను హాస్పటల్లో ఉచితంగా అందరికీ అందించి ఎందరో ప్రాణాలను కాపాడి ఆదర్శంగా నిలిచారని తెలిపారు.సమాజానికి తాను సేవ చేయడమే కాక తన అభిమానులతో కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అయ్యే విధంగా తీర్చిదిద్దటం ఆయనకే చెల్లిందన్నారు.
ఇంతింతై వటుడింతై అన్న చందంగా సినీ ప్రపంచంలో ఎవరి అండ లేకుండా స్వయంకృషితో ఎదిగి అందరి అభిమానాలను పొందిన వ్యక్తిగా ఈరోజు చిరంజీవి నిలిచారని తెలిపారు.సినీ ప్రపంచంలో, సమాజంలో ఆయన అందించిన సేవలను,నటనను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మ విభీషణుతో సత్కరించగా,గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవడం మరో విశేషం అన్నారు.చిరంజీవి ముందు ముందు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు.