19-05-2025 10:30:06 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చేరుకోనున్న రేవంత్ ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ.12,600 కోట్లతో ప్రారంభించనున్న ఈ పథకం రాష్ట్రంలోని పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైనా ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
అక్కడి నుంచి ముఖ్యమంత్రి సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సభ తర్వాత సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు చేయనున్నట్లు సమాచారం. కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి మధ్యాహ్నం హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకోనున్నారు.