రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: సీఎం
హైదరాబాద్: ప్రేమ ఆప్యాయతలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం మరింత బలపడాలని కోరుకుంటూ, పవిత్ర రాఖీ పౌర్ణమి(Raksha Bandhan) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శుభదినం రోజున అందరి ఇళ్లలో ఆనందం, ఆరోగ్యంతో గడపాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ఆడబిడ్డల కోసం గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందని సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం(Praja Prabhutvam) వారికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడబోమని సీఎం తేల్చిచెప్పారు. అక్కా చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) భరోసా ఇచ్చారు.






