25-07-2025 12:00:00 AM
ఆయుష్ వైద్య గదిలకు తాళం, ప్రాథమిక పాఠశాల భోజన వివరాలు గల్లంతు
జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు వెలుగు చూసిన వైనం
సిద్దిపేట, జూలై 24 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నంగునూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించగా అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఆయుషు గదులకు తాళం వేసి దర్శనం ఇచ్చాయి.
ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలుసుకొని డాక్టర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్ కు తగిన మందులు అందుబాటులో ఉంచాలని, ఆయుష్ వైద్యులు ప్రతిరోజు విధులకు హాజర అవ్వాలని ఆదేశించారు. నంగునూరు లోని హెల్త్ సబ్ సెంటర్ ని సందర్శించి ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పనితీరును పరిశీలించారు.
గ్రామాలలో ఎలాంటి వ్యాధులు సంభవిస్తున్నాయి, వాటికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం, అవసరమైతే ఆసుపత్రికి రెఫర్ చేయడం, గర్భిణి స్త్రీలు, బాలింతలకు తగిన సూచనలు చేయాలంటూ సిబ్బందినీ ఆదేశించారు. గ్రామానికి మంజూరైన 50 ఇందిరమ్మ ఇండ్లకు గాను 39 మాత్రమే పనులు ప్రారంభించడం పట్ల అధికారులు జోక్యం చేసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని దశలవారీగా పూర్తయిన పనులకు బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పనితీరు మెరుగుపరచుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.