16-12-2024 02:54:13 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే డిసెంబర్ 25 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే, గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో నర్సరీలలో బ్యాగ్ ఫీలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలన్నారు. రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, కంపోస్ట్ షెడ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామం నుంచి వచ్చే తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని, ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉపయోగిస్తూ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన మేర లాగిన్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతి తెలిసేలా ఫోటో యాప్ లో అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ డిసెంబర్ 25 లోగా పూర్తి చేసే విధంగా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జడ్పి సీఈఓ నరేందర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.