మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ
శ్రీశ్రీ తెలుగు ప్రజల్లో మర్చిపోలేని మహాకవి
కుషాయిగూడ జూన్ 15 (విజయక్రాంతి): మహాకవి శ్రీశ్రీ 43వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం కమలానగర్ కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు. స్పూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, రచయిత వి.బి. బంగారు ఆచార్యులు, స్పూర్తి గ్రూప్ నాయకులు ఎం. భాస్కరరావు మహాకవి శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అధ్యక్షుడు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వం చందస్సు, పదబంధాల సంకెళ్లను తెంచి సామాన్యుల భాషలో కొత్త దిశను చూపిందన్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేసిన తిక్కన, వేమన, గురజాడలే నిజమైన కవిత్రయమని పేర్కొన్నారు. సాంప్రదాయ కవిత్వాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మలిచిన కవిగా శ్రీశ్రీ నిలిచారని చెప్పారు. బంగారు ఆచార్యులు మాట్లాడుతూ కవిత్వంలో నూతన ప్రయోగాలకు శ్రీశ్రీ నాంది పలికారన్నారు.
అభ్యుదయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. జయరాజు, జి. శివరామకృష్ణ ప్రసంగిస్తూ శ్రీశ్రీ కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా అనేక సినీ గీతాలను రచించి తెలుగు సాహిత్యానికి, సినీరంగానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. అనంతరం సభలో పాల్గొన్న సభ్యులందరూ శ్రీశ్రీ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాస్, ఉన్నికృష్ణన్, శోభ, గౌసియా, దువా కిరణ్, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






