13-08-2025 12:00:00 AM
అశ్వరావుపేట, ఆగస్టు 12, (విజయక్రాంతి) అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పసుపులేటి చిన్న పోలయ్య, దమ్మపేట మండలం కి చెందిన చిట్టెటి సూర్య చంద్రం లు 2024 సంవత్సరంలో పామ్ ఆయిల్ తోటలో గెలలు కోస్తూ ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి మరణించారు. వారి కుటుంబానికి తెలంగాణా ఉత్తర విద్యుత్ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి రూ 5 లక్షల చొప్పున మొత్తం రూ 10 లక్షల నష్ట పరిహారంగా అందజేశారు.
గతం లో విద్యుత్ ప్రమాదాల ద్వారా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 4 కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వడం జరిగిందని ఏ డి ఈ ఈ బి వెంకటరత్నం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని ఏ డి ఈ ఈ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.ముఖ్యంగా అశ్వారావుపేట,
దమ్మపేట మండలాల పరిధిలో పామ్ ఆయిల్ తోటలలో పనిచేసేటప్పుడు గెలలు కోసేటప్పుడు విద్యుత్ లైన్స్తో జాగ్రత్తగా ఉండాలని, నాణ్యమైన ఐ స్ ఐ మార్క్ కలిగిన విద్యుత్ పరికరాలనే వినియోగించాలని, ఉతికిన బట్టలు అరబెట్టుకోడానికి ఐరన్ తీగకి బదులుగా నైలాన్ దారం ను వాడుకోవాలని, రైతుల స్టార్టర్స్ , మోటార్ పంపుసెట్ లను ఎర్తింగ్ చేసుకోవాలని, పశువుల్ని లైన్స్ కింద మరియు ట్రాన్స్ ఫార్మర్స్ దగ్గరలో ఉంచకూడదని,
ఎక్కడైనా విద్యుత్ లైన్స్ తెగిపడిన, కరెంట్ స్తంభాలు విరిగిపడినట్లు గుర్తించినా వెంటనే విద్యుత్ సిబ్బందికి గాని, తెలంగాణ ఉత్తర విద్యుత్ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి కాల్ చేయాలని తద్వారా వినియోగదారులు ప్రమాద రహిత విద్యుత్ ను పొందాలని ఏ డి ఇ శ్రీ బి వెంకటరత్నం గారు సూచించారు.ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట ఏ ఈ, జి రవి, దమ్మపేట ఏ ఈ, శ్రీ సాయి కిరణ్, సబ్ ఇంజనీర్లు కే విజయ్ క్రిష్ణ, ఎం. శివ శంకర్, విద్యుత్ సిబ్బందిపాల్గొన్నారు.