05-08-2025 10:09:30 PM
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్
తిమ్మాపూర్,(విజయక్రాంతి): మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అక్రమ ఇసుక రవాణా ద్వారా మద్దికుంట గ్రామానికి చెందిన సామాన్యుడు సురేష్ అనే వ్యక్తి మృతి చెందారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల 2వ తేదీన అర్ధరాత్రి పోచంపల్లి గ్రామ శివారులో ఇసుక లారీ ఢీకొని మద్దికుంట గ్రామానికి చెందిన కెక్కర్ల సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడని, సురేష్ అనే వ్యక్తి కరీంనగర్ లోని ప్రయివేటు షో రూమ్ లో ఉద్యోగం చేస్తూ తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇసుక లారీ డికొట్టి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఉండడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఆ వ్యక్తి కుటుంబాన్ని ఇసుక క్వారీ యజమానులు గాని, ఎవరు గాని పరామర్శించలేదని, పోలీస్ బలగాలతో లారీలకు కాపలా పెట్టారని అన్నారు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్వారీలు కాబట్టి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, ఎమ్మెల్యే క్వారీ తీసుకున్నప్పటి నుండి అరాచకాలు మొదలయ్యాయన్నారు. గతంలో మహిళలు సైతం లారీలను అడ్డుకున్నారని, అయినా ఇసుక క్వారీ మీద చర్యలు తీసుకుంట లేరనీ ప్రశ్నించారు.
సుమారు 150 నుండి 200 లారీలు రోడ్డు సైడ్ ఉంటున్నాయని రైతులు, వాహనాదారులు, ప్రమాదాలకు గురి అయ్యి మృత్యువాత పడుతున్నారని అన్నారు. ఇసుక దందా కోసమే మానకొండూరు ప్రజలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను గెలిపించారా ఆని ప్రశ్నించారు. మృతి చెందిన కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఆ వ్యక్తి దిన వారం వెళ్లేలోపు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.ఇసుక క్వారీ నడిపిస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై కేసులు పెట్టాలని పోలీసులకు సూచించారు. ఇసుక క్వారీలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణవి కాదు అని చెప్పే దమ్ము కవ్వంపల్లి సత్యనారాయణకు ఉందా, అని డిమాండ్ చేశారు.