08-08-2025 12:17:36 AM
ఎల్బీనగర్, ఆగస్టు 7 : హయత్ నగర్లోని తొర్రూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత స్వామి శివాలయంపై జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మేజర్మెంట్ చేసి, మార్కింగ్ వేయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కింగ్ వేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేషనల్ హైవే అధికారులు దేవాలయాన్ని కూల్చివేస్తామని చెప్పినట్టు చెప్పారన్నారు. బాలాత్రిపుర సుందరి ఆలయంలో ౪ దశాబ్దాలుగా నిరంతరంగా పూజలు జరుగుతున్నట్లు తెలిపారు. పవిత్ర స్థలంపై ముందస్తు సమాచారం లేకుండా అధికారులు మార్కింగ్ వేయడాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. హిందూ ఆలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందన్నారు. ఆలయాన్ని కూల్చివేయాలని ప్రయత్నిస్తే, పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను గౌరవించి ఆలయాన్ని సంరక్షించాలని కోరారు.