10-01-2026 07:13:32 PM
60 డివిజన్ల ఎన్నికలకు కౌంట్డౌన్
కొత్తగూడెం,(విజయక్రాంతి): రానున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా ఎగురవేయాలని ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా, శనివారం రామవరం 14వ డివిజన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గంటా గోపయ్య నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి రావాలని, నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని సూచించారు. ప్రజల మెప్పు పొందేలా నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
కొత్తగూడెం వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సన్నాహక సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్తలను సమర్థవంతంగా దిశానిర్దేశం చేయాలని, నాయకులకు సూచించారు. ప్రజాపాలనలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల వరకు తీసుకెళ్లాలని అన్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంలో కార్యకర్తలు, నాయకులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. అదే ఉత్సాహంతో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కాంగ్రెస్ పార్టీ వశం చేసుకోవాలని ఆకాంక్షించారు.