09-11-2025 06:55:26 PM
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు..
కోదాడ: దేవాలయ భూముల అన్యాక్రాంతంపై సీపీఐ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని కోదాడ ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న తమరబండపాలెం బాలాజీ దేవాలయ భూమిలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న స్థలాన్ని మీడియా ముందు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. పూర్వీకుల నుండి అమరావతి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రెండు ఎకరాల 13 కుంటలు, తమ్మర బండ పాలెం, బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెండు ఎకరాల 16 గుంటల భూమి ఉందన్నారు.
కాగా గత కొన్నేళ్ల క్రితం ఆక్రమణలకు గురి అయితే సిపిఐ పక్షాన పోరాడి ఆ దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడామన్నారు. కాగా ఇటీవల ఓ వ్యక్తి అమరావతి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టారన్నారు. ఆలయ భూమిలో మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారనీ ప్రశ్నించారు. లక్షల రూపాయల విలువ చేసే ఆలయ భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సిపిఐ పక్షాన ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఆలయ భూములు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.