04-08-2025 12:00:00 AM
తమ్మినేని వీరభద్రం
ఖమ్మం, ఆగస్ట్ 3 (విజయక్రాంతి): గత అనేక సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ పాలస్తీనా పైన చేస్తున్న అమానవీయ దాడులను వెంటనే ఆపివేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనా పైన ఇజ్రాయిల్ గత కొన్ని సంవత్సరాల నుండి యుద్ధం చేస్తూ, వేల మంది ప్రజల ప్రాణాలను బలిగొందని ఆయన విమర్శించారు.
కనీస యుద్ధ నియమ నిబంధనలను పాటించకుండా విచక్షణారహితంగా పాలస్తీనా పైన బాంబుల వర్షం కురిపిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఆగస్టు ఏడవ తేదీన ఖమ్మం నగరంలో ఇజ్రాయిల్ యుద్దోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ పెద్ద ర్యాలీ జరగబోతుందని తెలిపారు.
పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీకి సిపిఎం పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తోందని ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశం లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. సుదర్శన్ రావు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, వై. విక్రమ్ తదితరులు ఉన్నారు.