26-07-2024 12:57:59 AM
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): నకిలీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ తెలిపారు. అలాంటి వారి పట్ల టీజీఎంసీ కఠినంగా ఉంటుందని, ఎప్పటికప్పుడు నకిలీ వైద్యుల భరతం పడుతుందని హెచ్చరించారు. గురువారం నగరంలో పలు చోట్ల గుర్తింపు లేకుండా వైద్యం చేస్తున్నవారిని, నకిలీ వైద్యులను టీజీఎంసీ దాడుల్లో గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులకు సమాచారం అందిం చారు. మరోవైపు అనుభవం వైద్యసేవలు అందిస్తున్న పలువురిని సైతం గుర్తించి కౌన్సిల్కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నగరంలో క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
5 బృందాలతో దాడులు
నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కిన్, లేజర్, కాస్మటలజీ కేంద్రాలపై ఏకకాలంలో 5 బృందాలుగా ఏర్పడి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు నిర్వహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్సిటీ, కూకట్పల్లి, మియాపూర్ ప్రాం తాల్లో మొత్తం 40 కేంద్రాల్లో టీజీఎంసీ తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో ముగ్గురు నకిలీ వైద్యులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు కోసం పోలీసులకు వివరాలు అందజేశారు. 20 మెడికల్ సెంటర్స్లో చర్మవ్యాధి నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్స్ లేకుండా ఎలాంటి అనుమతులు పొందకుండా లేజర్స్ వినియోగిస్తున్నట్లుగా టీజీఎంసీ గుర్తించింది.
ఎలాంటి అర్హతలు లేకుండానే వైద్యం చేస్తున్న డెంటల్, ఆయుర్వేదిక్, హోమియోపతి చేస్తున్న వైద్యులకు నోటీసులు ఇవ్వడంతో పాటు వారి గురించి కౌన్సిల్కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు టీజీఎంసీ మహేశ్ వెల్లడించారు. జాతీ య మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం కాస్మటలజీ, లేజర్, పీఆర్పీ థెరపీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి చికిత్సలు డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్య విద్య చదివిన డాక్టర్లు మాత్రమే నిర్వహించాలని తెలిపారు.
ఇతర కోర్సులు చేసి లేజర్ కాస్మటలజీ చికిత్స చేయడం నేరమని, అలా చేసిన వారిపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికైనా అర్హతలేని నకిలీ వైద్యులు తమ పరిధికి మించి వైద్యం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం మానుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతా ల్లో వైద్యం పేరుతో 70 శాతం అర్హత లేని నకిలీ వైద్యులు ప్రజలను మోసగించడాన్ని ఆపాలని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్కుమార్ హెచ్చరించారు.