10-11-2025 12:00:00 AM
* విద్యుత్ అధికారుల నిర్వాకం
కొల్చారం, నవంబర్ 9 : కొల్చారం మండలం వాసురం తండా గ్రామంలో హరితహారం ద్వారా ఏర్పాటు చేసిన మొక్కలను అధికారులు నరికివేశారు. లక్షలు వేచ్ఛించి నాటిన మొక్కలు నిర్లక్ష్యంగా విద్యుత్ అధికారులు తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వైర్లకు అడ్డుగా కొమ్మలుంటే కేవలం చెట్ల కొమ్మలను మాత్రమే తీసివేయాలి.
కానీ ఇక్కడ విద్యుత్ సిబ్బంది మొత్తం మొక్కలను తొలగించడం విమర్శలకు దారి తీస్తోంది. ఒకపక్క ప్రభుత్వం హరితహారం ద్వారా మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని ప్రకటనలు చేస్తుంటే, మరో పక్క మొక్కలను పూర్తిగా తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మండల విద్యుత్ ఏఈ హైమద్ అలీని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, కేవలం కొమ్మలను మాత్రమే తొలగించాలి తప్ప చెట్లను తొలగించవద్దని తెలిపారు.