ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: ఖమ్మం జిల్లా(Khammam District) మధిర నియోజకవర్గంలోని వంగవీడులో ఆదివారం 630.30 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలో డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ... మాకు నీళ్లు రావట్లేదని గతంలో ఈ ప్రాంత ప్రజలు పాలకులను వేడుకున్నారని.. ఈ ప్రాంత ప్రజల అవసరాల తీర్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవడానికి తాము కృషి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందని, నాగార్జునసాగర్ కెనాల్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ది చెందిందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.






