8 July, 2026 | 2:21 AM

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

12-09-2025 12:19 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్చెరు, సెప్టెంబర్ 11:పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్దేశించిన లక్ష్యం లోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు డివిజన్లో పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ప్రధానంగా సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రహరీ గోడలు, స్మశాన వాటికలో అభివృద్ధి పనులు, సామాజిక ఫంక్షన్ హాళ్లు, పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ.. పలు అభివృద్ధి పనుల్లో వేగం మందగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు కాంట్రాక్టర్లు సమన్వయం చేసుకుంటేనే సత్ఫలితాలు సాధిస్తామని సూచించారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, ఏఈలు శివకుమార్, ఫైజన్, దివ్య తేజ, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.