24-01-2026 08:54:42 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు. ముందుగా కొత్తగంగారం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన సుంకిపాక శివకుమార్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మంజూరయ్యే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించి ఇంటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుంజా రమేష్ ను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.పాత గంగారం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు మిడియం ముత్యాలు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం తాళ్లపాయి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి,కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,తాసిల్దార్ భగవాన్ రెడ్డి,ఎంపీడీవో రామారావు వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, సర్పంచులు,కాంగ్రెస్ నాయకులు తాండ్ర ప్రభాకర్ రావు బత్తుల అంజి తదితరులు పాల్గొన్నారు.