04-01-2026 09:54:55 AM
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : జిల్లా కలెక్టర్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 45,823 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు. మండలాల వారీగా యూరియా నిల్వలను వ్యవసాయ శాఖ సమీక్షించగా, అన్ని మండల వారీగా సరిపడా నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. మార్కెట్లో అదనంగా మరో 15 వేల యూరియా బస్తాలు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే మూడు నెలలకు అవసరమైన యూరియా సరఫరాపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక పంపినట్లు పేర్కొన్నారు.
ప్రతి వారం జిల్లాకు అవసరమైన మేర యూరియాను కేటాయిస్తున్నట్లు తెలిపారు. మండలాల్లో సాగు చేసిన పంటల ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా అందేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.