13-08-2025 05:57:57 PM
పోలీసులకు ఎస్పీ ఆదేశాలు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): వరద వచ్చే సమయంలో ప్రజలను వాగులను దాటనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్(District SP Sudhir Ramnath Kekan) పోలీసులను ఆదేశించారు. జిల్లాలోని మున్నేరు, రాంపూర్ చెక్ డ్యామ్ ను జిల్లా ఎస్పీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పరిధిలో ఉన్న వాగులను వరద ప్రవాహం సమయంలో దాటకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా గస్తీ నిర్వహించాలని, అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే విధంగా రెస్క్యూ టీంలను, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. స్థానిక ప్రజలకు వరద, వర్షం వివరాలను తెలియజేసే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటిమట్టం పెరుగుతున్న ప్రాంతాల్లో పహారా ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి ఆపద కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది తలెత్తిన వెంటనే 100కు డయల్ చేయాలని ఎస్పీ కోరారు. ఎస్పీ వెంట డిఎస్పి తిరుపతిరావు, సీఐ రవికుమార్, ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.