08-09-2025 01:39:39 AM
జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులు, మతపరమైన, కులపరమైన, రాజకీయపరమైన విభేదాలు రేకెత్తించే వ్యాఖ్యలు, గ్రూపులకు, సంఘాలకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేయడం సరికాదని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు.
సోషల్ మీడియాలో అసత్య వార్తలు, తప్పుడు సమాచారం, ద్వేషపూరిత వ్యాఖ్యలు, రాజకీయపరమైన, మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు చేస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, సంఘాలు లేదా గ్రూపులకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడం నేరమని, సమాజంలో శాంతి సామరస్య వాతావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పంచే ప్రతి సమాచారం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, నిర్ధారణ లేని వార్తలను నమ్మకూడదని, షేర్ చేయకూడదని సూచించారు. ఇలాంటి పోస్టులు గమనించిన వారు వెంటనే తమకు సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ (100/112) కి సమాచారం అందించాలన్నారు.జిల్లా పోలీస్ విభాగం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తూ ఉంటుందని, సమాజ శాంతి భద్రతల కోసం ప్రతి ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు.