19-08-2025 12:00:00 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
టేక్మాల్, ఆగస్టు 18 : టేక్మాల్ మండలం బొడ్మాట్ పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు ఇంటిలోకి వచ్చిన బాధితుల ఇంటికి జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపద్యంలో టేక్మాల్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది.
నిన్న రాత్రి ఎడతెరిపి వాన కురవడంతో వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో మండలంలో కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇందులో భాగంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కలెక్టర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు మనోధైర్యం కల్పించారు. వరద నీరు ఇండ్లలోకి చేరిన సందర్భంగా వాటిని తొలగించే ఏర్పాటు చేయాలని, పాడైన నిత్యావసర వస్తువులను అంచనా వేసి తక్షణ సహాయ సహకారాలపై దృష్టి సారించాలని తహసిల్దారుకు సూచించారు.