01-10-2025 12:22:37 AM
‘కాంతార’ ప్రీక్వెల్కు టికెట్ ధరల పెంపు విషయమై తెలుగు సినిమా పరిశ్రమ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలుగు సినిమాను కర్ణాటకలో విడుదల సందర్భంలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని, మన చిత్రాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అక్కడి రాష్ర్ట ప్రభుత్వం సానుకూలంగా ఉండటంలేదని పేర్కొన్నారు. కన్నడ చిత్రాలకు టికెట్ ధర పెంపుపై పునరాలోచన చేయాలని కోరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పవన్కల్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఫలితంగా ‘కాంతార’ ప్రీక్వెల్పై ప్రస్తుతం సోషల్మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తోంది. అయితే, ఈ పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ స్పందించారు. “కర్ణాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు.
కళ అనేది మనసుల్ని కలపాలి.. విడదీయకూడదు. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ నటులందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాం. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ చాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాం. ‘కాంతార: చాప్టర్1’కు ఆటంకాలు కల్పించొద్దు” అన్నారు.