01-10-2025 12:25:16 AM
రిషబ్శెట్టి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజాచిత్రం ‘కాంతార: చాప్టర్1’. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకరోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శనకూ వీలు కల్పించింది. సినిమా విడుదల రోజు నుంచి అక్టోబర్ 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.75 (జీఎస్టీ అదనం), మల్టీఫ్లెక్స్ల్లో రూ.100 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకునే వీలు కల్పించింది.
ఇంకా బుధవారం రాత్రి 10 గంటలకు ప్రీమియర్ వేసేందుకూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ టికెట్లకు సింగిల్ స్క్రీన్లలో రూ.75 (జీఎస్టీ అదనం), మల్టీఫ్లెక్స్ల్లో రూ.100 (జీఎస్టీ అదనం) చొప్పున పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. కర్ణాటకలో తెలుగు సినిమాల విడుదలకు కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో ‘కాంతార’ ప్రీక్వెల్పై బాయ్కాట్ ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాకు టికెట్ ధరలు, ప్రీమియర్స్ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.