10-05-2025 07:23:53 PM
డిఆర్డిఓ పిడి జయదేవ్ ఆర్య
దౌల్తాబాద్,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు(Paddy Grain Purchases) ప్రక్రియను వేగవంతం చేయాలని సిద్దిపేట డిఆర్డిఓ పిడి జయదేవ్ ఆర్య అన్నారు. శనివారం రాయపోల్ మండలం లింగారెడ్డి పల్లి, దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామాలలోని ఐకెపి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
తాగునీరు, టెంటు, తేమశాతం కొలిచే యంత్రాలు, గన్ని బ్యాగ్స్, టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాలు అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన వెంటనే కేటాయించిన మిల్లులకు ధాన్యంను ఆలస్యం చేయకుండా తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని, అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం తరలింపులో వాహనాల కొరత రాకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో రాయపోల్, దౌల్తాబాద్ ఏపిఎంలు కిషన్,యాదగిరి, సీసీలు, సిఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.