23-08-2025 12:28:44 AM
గజ్వేల్ ఆర్ పి కృష్ణ లీల, సరస్వతి సమాఖ్య అధ్యక్షురాలి తొలగింపు
గజ్వేల్, ఆగస్టు 22: దుబ్బాక మున్సిపాలిటీలో మెప్మా సి ఓ గా విధులు నిర్వహిస్తున్న సరితను సస్పెండ్ చేయడంతో పాటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతి సమాఖ్య ఆర్ పి కృష్ణ లీల, అధ్యక్షురాలు కర్నాల మంజులను విధుల నుంచి తొలగించారు. మహిళా సంఘాల రుణాలలో అక్రమాలు చేసినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు ఈ చర్యలను తీసుకున్నట్లు గజ్వేల్ ప్రజ్ఞాపూర్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్లు బాలకృష్ణ, రమేష్ తెలిపారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో గతంలో సిఓ సరిత పనిచేయగా, ఏనాగుర్తి కృష్ణ లీల సరస్వతి సమాఖ్య కు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించింది. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించి వారి నుంచి అక్రమంగా డబ్బులను తీసుకొని వాడుకోవడంతో నిజాలు తెలుసుకున్న 10 మహిళా సంఘాల సభ్యులు కృష్ణ లీలపై, ఇందులో భాగస్వాములైన సమాఖ్య అధ్యక్షురాలు కర్నాల మంజుల పై కలెక్టర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ విచారణ చేపట్టి నివేదికను గత నెల రోజుల క్రితం కలెక్టర్కు అందజేశారు. నివేదికను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం గజ్వేల్ సి ఓ గా పనిచేసే బదిలీపై దుబ్బాక మెప్మా సీవోగా పనిచేస్తున్న సరితను సస్పెండ్ చేశారు.
గజ్వేల్ మెప్మాలో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న ఏనగుర్తి కృష్ణ లీలలు, సరస్వతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కర్నాల మంజులను విధుల నుంచి తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ వెల్లడించారు. రుణాల అక్రమాలలో కోటి రూపాయలకు పైగానే నిందితులు కాజేసినట్లు గతంలో విచారణ అధికారి వెల్లడించగా, ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం దోషుల నుండి అధికారులు డబ్బులు రికవరీ చేయనున్నట్లు తెలిసింది. మరిన్ని కఠిన చర్యలు దోషులపై తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.