27-08-2025 01:39:48 AM
వాషింగ్టన్, ఆగస్టు 26: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య మరోసారి చిచ్చు రాజుకున్నది. పరస్పరం ప్రతీకార సుంకాలు విధించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని గడగడలాడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. చైనాలో అరుదైన ఖనిజాలతో తయారయ్యే అరుదైన ఖనిజాలను సరఫరా చేయకుంటే 200 శాతం సుంకం విధిస్తామని బెదిరించారు. వాషింగ్టన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాపై ప్రయోగించేందుకు చైనా వద్ద కొన్ని అస్త్రాలు ఉన్నాయి.
మేం చైనాపై ప్రయోగించడానికి మా వద్ద కొన్ని అస్త్రాలు ఉన్నాయి. కానీ, మేం అస్త్రా లు ప్రయోగిస్తే, చైనా నాశనమవుతుంది. బహుశా.. చైనా అక్కడి వరకు పరిస్థితి తెచ్చుకోదని భావిస్తున్నా’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తాను త్వరలో లేదా, ఈ ఏడాది చివరిలోపు చైనాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు.
స్మార్ట్ఫోన్ల నుంచి ఫైటర్ జెట్ల వరకు అన్నింట్లోనూ ఆ అరుదైన మ్యాగ్నట్ల విని యోగం జరుగుతన్నది. వాటి ఉత్పత్తిపై ఇప్పటికే చైనా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నది. దీంతో వాషింగ్టన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాలు సుంకాల నిలిపివేతను 90 రోజులు పొడిగించేందుకు అంగీకరించాయి. నవంబర్ 10 వరకు అధిక సుంకాల విధింపును వాయిదా వేశాయి. మున్ముందు రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనమిస్తున్నాయి