05-07-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం అసిఫాబాద్, జూలై 4(విజయక్రాంతి) : రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుల త్యాగాల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్,ఎమ్మెల్యే కోవ లక్ష్మి, యాదవ , ఆర్యవైశ్య సంఘాల నాయకులు, అధికారులతో కలిసి దొడ్డి కొమురయ్య, కొణిజేటి రోశయ్య చిత్రపటాల వద్ద జ్యోతిని వెలిగించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన మహనీయులు అందరిని స్మరించుకుంటూ వారి త్యాగాల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కలిసి కృషి చేద్దామని అన్నారు. తెలంగాణ సాయుధం పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బహుజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరా టం చేశారని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన కొణిజేటి రోశయ్య గొప్ప ఆర్థికవేత్త అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసే 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మేధావి అని తెలిపారు. మహనీ యుల త్యాగాలను, సేవలను భావితరాల వారికి అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, డిడి రమాదేవి, డి డబ్ల్యు ఓ భాస్కర్, కలెక్టరేట్ ఏవో కిరణ్ కుమార్, మాజీ ఎం పి పి అరిగెల మల్లికార్జున్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, యాదవ, వైశ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.