09-10-2025 08:13:26 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్..
మందమర్రి (విజయక్రాంతి): రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని మందమర్రి, తాండూర్, బెల్లంపల్లి మండల కేంద్రాల్లోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను సందర్శించి, నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం విడుదల చేసిన కార్యచరణ ప్రకారం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హత గల ప్రతి ఒక్కరూ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది, ఆయా ఎంపిడిఓ లు, కార్యాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.