24-08-2025 12:48:44 AM
-ధర్మస్థలి సామూహిక ఖననం కేసులో మాట మార్చిన ముసుగు మనిషి
-అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
-ముసుగు మనిషి ‘చిన్నయ్య’గా గుర్తింపు
-10 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
బెంగళూరు, ఆగస్టు 23: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ధర్మస్థల వందల మృతదేహాల ఖననం కేసులో కీలక మలుపుచోటు చేసుకుంది. వందల మృతదేహాలను పూడ్చిపెట్టానని అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన ముసుగు మనిషి భీమాను శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవపట్టించాడని పేర్కొన్నారు.
ముసుగు తొలగింది..
ధర్మస్థలలో చాలా ఏండ్ల పాటు పారిశుధ్య విధులు నిర్వర్తించానని, విధి నిర్వ హణలో భాగంగా వందల మంది మహిళల మృతదేహాలను పాతిపెట్టానని భీమా అలియాస్ చెన్నయ్య పోలీసులతో చెప్పాడు. దీంతో ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది. ఆ మృతదేహాల ఆనవాళ్ల కోసం భీమాతో కలిసి సిట్ అధికారులు అనేక చోట్ల తవ్వి చూశారు. కానీ ఎక్కడా మృతదేహాల ఆనవాళ్లు లభించలేదు.
చివరికి అసలు తాను ధర్మస్థలిలో విధులు నిర్వర్తించలేదని, అబద్దపు సాక్షం చెప్పానని భీమా పేర్కొన్నాడు. దీంతో సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతడిని సీఎన్ చిన్నయ్యగా గుర్తించారు. అతడిని కోర్టు ఎదుట హాజరుర్చి.. 10 రోజుల కస్టడీ కోరగా.. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ విజయేంద్ర సమ్మతించారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ‘2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా.. నాకు ఒక పుర్రెను ఇచ్చి కొందరు సిట్ అధికారులకు ఇప్పించారు. నేను ధర్మస్థలిలో విధులు నిర్వర్తించలేదు’ అని పేర్కొన్నాడు.