27-10-2025 01:48:12 AM
దేశంలో గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
-ఆంధ్రప్రదేశ్లో రెండు, ఢిల్లీలో అత్యధికంగా 10 విశ్వవిద్యాలయాలు
-చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖలు రాసిన యూజీసీ
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): దేశంలో ఫేక్ యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 22 గుర్తింపులేని యూనివర్సిటీలను నిర్వహిస్తున్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) డేటాలో తేలింది. ఈ మేరకు వెబ్సైట్లో గుర్తింపు లేని యూనివర్సిటీల వివరాలను పొందుపరిచింది.
అత్యధికంగా ఢిల్లీలోనే పది యూనివర్సిటీలు ఉండడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లో నాలుగు, ఆంధ్రప్రదేశ్లో రెండు, కేరళలో రెండు, వెస్ట్ బెంగాల్లో రెండు ఉన్నాయి. ఈ ఫేక్ యూనివర్సిటీలపై ఆయా రాష్ట్రాలు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని యూజీసీ లేఖలు రాసింది. ఏపీలో క్రీస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా పేరుతో రెండు యూనివర్సిటీలను యూజీసీ గుర్తించింది.
ఢిల్లీలో ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ జురిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ(స్పిరుట్యువల్ యూనివర్సిటీ), వరల్డ్ పీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజినీరింగ్.
కేరళలో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటెక్ మెడిసిన్, సెయింట్ జాన్స్ యూనివర్సిటీ. మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చేరిలో శ్రీబోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఉత్తర్ప్రదేశ్లో గాంధీ హిందీ విద్యాపీఠ్, భారతీయ శిక్షా పరిషత్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, మహామయ టెక్నికల్ యూనివర్సిటీ, వెస్ట్ బెంగాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలున్నాయి.
ఆ డిగ్రీ పట్టాలకు విలువ లేదని..
ఢిల్లీ కోట్లా ముబారక్పుర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ అనుమతులు లేని డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆ సంస్థ జారీ చేసే డిగ్రీ పట్టాలకు ఎలాంటి విలువ లేదని చెప్పింది. అంతేకాదు ఈ యూనివర్సిటీని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలనకు సంబంధించి ఏ చట్టం కింద ప్రారంభించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలు ముఖ్యంగా ఢిల్లీలోని విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
నేషనల్, మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్, టెక్నాలజీ లాంటి పదాలతో విద్యాసంస్థలకు పేర్లు పెడుతున్నాయి. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరేటప్పుడు అది నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? చూసి చేరాలని యూజీసీ సూచించింది. లేకుంటే ఆ గుర్తింపులేని వర్సిటీల్లో ఫీజులు కట్టి డిగ్రీలు పొందాల్సి ఉంటుందని పేర్కొంది.