22-01-2026 01:48:51 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ఈ చేతకాని సీఎం రేవంత్రెడ్డిదే అని మండిపడ్డారు. ఆలంపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడటం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
మల్లు రవి క్షమాపణ చెప్పాలి: హరీశ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన దాడిని మాజీ మంత్రి హరీశ్రావు ఖండించారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.