20-08-2025 08:09:37 PM
అధిక మోతాదులో యూరియాను వాడవద్దు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తాడ్వాయి,(విజయక్రాంతి): రైతులు నానో యూరియాను వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల, సంతాయిపేట, తాడువాయి గ్రామాలలో ఆయన బుధవారం వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కువ మోతాదులో యూరియాను వాడడంతో పంటలకు అనేక నష్టాలు జరుగుతున్నాయని తెలిపారు.
వరి, మొక్కజొన్న పంటలకు అధిక మోతాదులో యూరియా ఎరువులు వాడడంతో పంటలకు చీడపీడలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. రైతులు అధునాతన పద్ధతిలో నానో యూరియాను పంటలకు పిచికారి చేసుకోవాలని సూచించారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుందని తెలిపారు. ఈ నానో యూరియాను వాడుకున్నట్లయితే రైతులు మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చునారు. ఒక ఎకరాకు 500 మిల్లీ లీటర్ల నానో యురియా సరిపోతుందని తెలిపారు.
రైతు పొలంలో నానో యూరియాను పిచికారి చేయాలంటే సాధారణంగా ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు ఒక రోజులో పిచికారి చేయగలుగుతారన్నారు. కానీ డ్రోన్ పద్ధతిలో ఒక రోజులో 50 నుంచి 70 ఎకరాల వరకు నానో యురియాను పంటలకు పిచికారి చేయవచ్చని సూచించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో డ్రోన్ పద్ధతిలో నానో యూనియన్ ఎలా పిచికారి చేయవచ్చు అనే పద్ధతులు రైతులకు చూపించారు. యూరియా ఎక్కువగా పంటలకు వాడడంతో పంటలకు చీడపీడలు రావడం, భూసారం దెబ్బ తినడం లాంటి ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు రైతులు ఇకముందు యూరియా ఎరువు వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు.