09-09-2025 06:59:11 PM
పాత బెల్లంపల్లి గ్రామంలో విషాదం..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు గురై మహిళా వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు పాత బెల్లంపల్లి గ్రామానికి ఆదిముల్ల మహేందర్ పత్తి చేనులో ఆదిముల్ల పావణి, అంజలి, మచ్చర్ల భాగ్య లతో కలుపుతీసే పనికి వెళ్ళింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగు వేసింది. ఈ ఘటనలో గెల్ల పద్మ అనే మహిళా వ్యవసాయ కూలీ అక్కడే మృతి చెందింది. మిగతా వ్యవసాయ కూలీలు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతి చెందిన పద్మ కు భర్త వెంకటి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన పాత బెల్లంపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాజీ జెడ్పిటిసి కారుకూరి రామచందర్ తెలిపారు.