09-09-2025 07:05:00 PM
నిర్మల్ (విజయక్రాంతి): కలెక్టరేట్లో మంగళవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిషోర్ కుమార్(District Additional Collector Kishore Kumar) హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ ప్రజల హృదయాలకు హత్తుకునేలా, తెలంగాణ యాసలో కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు అందజేసిందని గుర్తుచేశారు. కాళోజీ పుట్టినరోజుని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం ద్వారా భావితరాలకు వారి గొప్పతనం చేరువవుతుందని అదనపు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు నరసింహారెడ్డి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, మోహన్ సింగ్, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.