24-12-2025 02:06:58 AM
సూర్యాపేట, డిసెంబర్ 23 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల చించివేత ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డిలు మంగళవారం యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ స్వామి వారి వైకుంఠద్వారం వద్ద కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఆలయ సన్నిధిలో పొలిటికల్ ఫ్లెక్సీల ఏర్పాటుపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. గతంలో తమను అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనీయలేదని కొద్దిసేపు ఆందోళన చేశారు. తదుపరి అక్కడికి వెళ్లి ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులను స్టేషన్ కు తరలించారు.