15-08-2025 01:24:52 AM
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు, మూడు రోజులపాటు భారీవర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని రాష్ర్ట రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి చొప్పున విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతమూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ.. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ రామకృష్ణారావుతో కలసి గురువారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 24 గంటల్లో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
రాబోయే 24 గంటల్లో రెడ్ అలెర్ట్ జారీ అయిన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు చెప్పారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైల్వే లైన్లు, లోలెవెల్ బ్రిడ్జీలు, కాజ్వేలు, అండర్పాస్లు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
లో లెవెల్ బ్రిడ్జీల దగ్గర పోలీస్ సిబ్బందిని నియమించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.