19-11-2025 07:29:10 PM
మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్..
కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని పార్కులను వదిలేద్దామా.. కాపాడుకుందామా అని నగర మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పాలన పేరుతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగరంలోని ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం దృష్టిలో పెట్టుకొని మహాత్మా జ్యోతిబాపులే పార్కును ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ బోర్డుకు అప్పగించామని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ మహాత్మా జ్యోతిబాపులే పార్కులోని 4 గుంటల స్థలాన్ని విద్యుత్ శాఖకు కేటాయించారనీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నగర ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించకుండా నిభందనలు ఉల్లంఘించారని ఆరోపించారు. నగర పురపాలక సంస్థ ప్రజా పరిపాలన కోసమని, నగరంలోని స్థలాలను కేవలం అభివృద్ధికి, స్మార్ట్ సిటీ పనులను మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జీవోను నిబంధలను ఉల్లంఘించారని, వెంటనే పురారలోచన చేయాలని ప్రవేశపెట్టిన జీవో రద్దు చేయాలని సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు.