10-02-2025 11:16:24 PM
రాజేంద్రనగర్: బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం చేపట్టిన ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతలపై మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఓ శుభకార్యం నిమిత్తం టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి అప్పా జంక్షన్ వైపు వెళ్తుండగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు జరుపుతుండగా ఆయన విషయం గమనించి తన వాహనాన్ని ఆపారు. అక్కడికి వెళ్లి కూల్చివేతలు నిలిపివేయాలని మున్సిపల్ సిబ్బందిని కోరారు. జరుగుతున్న విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రను అడిగి తెలుసుకున్నారు. కూల్చివేతలతో జనం రోడ్డున పడుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఫుట్ పాత్లపై షెడ్లు, డబ్బాలు వేయడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. లోపలికి ఉన్న వాటిని తొలగించండి అంటూ చెప్పి హరీష్రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టారని బాధితులు మాజీమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. పేదల పొట్టకొట్టవద్దని మాజీ మంత్రి తెలియజేశారు.