20-08-2025 11:56:30 PM
వేకువజామునే క్యూలో నిలబడి యూరియా కోసం పడిగాపులు
రైతులకు యూరియా కొరత తీరేది ఎప్పుడో?
ఆగ్రహంతో ధర్నాకు దిగిన రైతులు
రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,(విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది, రైతులు తమ పంటలకు అవసరమైన ఎరువులు పొందడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొని, ప్రభుత్వాన్ని విమర్శించారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు తెల్లవారుజాము నుంచే క్యూలలో నిలబడి, టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రం ఇంటికే టోకెన్లు అందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయనీ మాజీ ఎమ్మెల్యే అన్నారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం ధర్నా నిర్వహించిన రైతులకు మద్దతుగా పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలమైందని, అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే యూరియా అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. వరంగల్ జిల్లాలో యూరియా సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.