30-01-2026 12:52:39 AM
తాండూరు, జనవరి 29 (విజయ క్రాంతి): ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ఎవరో ప్రకటించు.. దౌర్జన్యాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి , ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసిన సందర్భంగా పాల్గొన్నారు.
రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ధికారంలోకి వచ్చిందని..సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని.. ఇక పట్టణ ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తాండూరులో ఎగిరేది బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. మా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడుతూ ఎన్నికల్లో పోటీ చేయకుండా కిడ్నాప్లకు పాల్పడుతున్నారని.. ప్రశాంతంగా ఉన్న తాండూర్ పట్టణాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దౌర్జన్యాలకు దిగడం సరికాదని.. హితవు పలికారు. రోహిత్ రెడ్డి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీశైలం రెడ్డి, చైర్పర్సన్ అభ్యర్థి నర్సింలు, తదితరులు ఉన్నారు.