09-07-2025 08:08:24 PM
నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేయాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ
చండూరు (విజయక్రాంతి): కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోడీ అని కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ(CITU District President Chinnapaka Laxminarayana) అన్నారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో అఖిలభారత సార్వత్రిక సమ్మె పిలుపుమేరకు సిఐటియు ఆధ్వర్యంలో చండూర్ మార్కెట్ యార్డ్ నుండి చండూరు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు.
ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప చెప్పవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు 10 గంటలు పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ముందుకు తెచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, చాలీచాలని జీతాలతో కార్మికులు జీవనోపాధి కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబెట్టారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ, సిఐటియు సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య,బి ఆర్ టి యు చండూర్ టౌన్ అధ్యక్షులు చొప్పరి దశరథ, గ్రామపంచాయతీ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి నాంపల్లి శంకర్, పుష్పలత, నాగిల్ల లక్ష్మయ్య, కృష్ణయ్య, యాదయ్య, బిక్షమయ్య,మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు కత్తుల సైదులు, బిపంగి నాగరాజు, ఇరిగి యాదగిరి, నల్లగంటి లింగస్వామి, కలమ్మ, రేణుక,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కట్ట పద్మ, నాగమణి, వివో ఎల చండూరు మండల అధ్యక్షులు యాదయ్య, హాల్యా, హమాలి యూనియన్ అధ్యక్షులు సాయం కృష్ణయ్య, నాగరాజు, నాగేష్, కలమ్మ, రేణుక, బి ఆర్ టి యు నాయకులు మల్లేశం, వెంకటేశం, జిట్టగోని యాదయ్య, శేఖర్ రెడ్డి, పరమేష్, యాదయ్య, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు నకరికంటి బిక్షమయ్య, టి. యాదయ్య, అంజయ్య, ఏ.రాములు, నక్కపోతు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.