10-01-2026 03:01:46 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ) ఆధ్వర్యంలో అంకుశం గ్రామ పంచాయతీలో ఎఫ్పీఓ (Farmer Producers Organization) సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం నిర్వహించారు. అడాప్షన్ ఆఫీసర్ బి. సురేందర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా రైతులు ఎఫ్పీఓలో సభ్యులుగా చేరి, సమూహంగా వ్యవసాయం చేయడం ద్వారా ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు ఎఫ్పీఓ లక్ష్యాలు, ప్రయోజనాలు వివరించారు. రెండు వేల రూపాయల సభ్యత్వ ఫీజు చెల్లించి 10 మంది రైతులు సభ్యత్వం పొందారు. అంకుశం గ్రామ పంచాయతి సర్పంచ్ బొంతల అరుణ చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొప్పుల భానుచందర్, చంద్రవెల్లి పీఏసీఎస్ కార్యదర్శి, సిబ్బంది, సహాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.