21-08-2025 11:26:57 PM
బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..
మందమర్రి (విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించాలని బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్(ACP Ravikumar) సూచించారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పండుగలు మన సంస్కృతికి, ఐక్యతకు ప్రతీకలని, వాటిని సహోదర భావంతో జరుపుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ప్రతి మండపం వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
గణేష్ నవరాత్రులలో డీజే సిస్టమ్లకు ఎలాంటి అనుమతి లేదని ఆయన పునరుద్ఘాటించారు. సోషల్ మీడియాలో వ్యాపించే అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే అభ్యంతరకర పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటివి దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. అనంతరం మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, విగ్రహాల నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ మత పెద్దలు మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, శాంతియుత వాతావరణాన్ని కాపాడటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ శాంతి కమిటీ సమావేశంలో ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేలా అందరూ సహకరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈకార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, అదనపు ఎస్ఐ నూనె శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది, వివిధ మతాలకు చెందిన మత పెద్దలు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.