17-09-2025 12:00:00 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా కోసం రైతుల తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం తెల్లవారుజామునే సింగిల్ విండో కార్యాలయం, ఫెర్టిలైజర్ షాపుల వద్ద పస్తులు ఉంటూ పడిగాపులు కాస్తున్నారు. అయినా కూడా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. రైతులపై ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట తెల్లవారుజామునే రైతులు క్యూ కట్టారు.
గత మూడు రోజుల క్రితం యూరియా బస్తాల కోసం టోకెన్లు ఇచ్చిన అధికారులు మంగళవారం యూరియా భాస్కర్ టోకెన్ల వారిగా పంపిణీ చేస్తామని చెప్పడంతో తెల్లవారుజామునే చేరుకున్నారు. కూపన్లు పంపిణీ చేసిన వారికి యూరియా బస్తాలు అందించారు. భిక్కనూరు మండలం జంగంపల్లిలో యూరియా కోసం రైతులు పస్తులు ఉంటూ పడిగాపులు కాశారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో క్యూ కట్టారు.
జగదేవపూర్లో రాస్తారోకో
జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ కృష్ణరెడ్డి చేరుకుని రైతులకు నచ్చజెప్నే ప్రయత్నం చేసినా వినలేదు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారి వసంతరావు నచ్చజెప్పడంతో ధర్నా విరమింపజేశారు. ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు.