బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించాలి
రాజ్భవన్ ఎదుట సీపీఎం నిరసన
హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనపై సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు శుక్రవారం రాజ్భవన్ను ముట్టడించారు. గవర్నర్కు వినతిపత్రం సమర్పించేందుకు సీపీఎం నాయకులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ముందుగా అపాయింట్మెంట్ లేదని, లోపలికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో సీపీఎం నేతలు రాజ్భవన్ ప్రధానగేటు ఎదుటే బైఠాయించి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నినదించారు. గవర్నర్ తక్షణమే స్పందించి బిల్లుపై సంతకం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






