calender_icon.png 8 November, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిథిగృహం.. అంధకారం

08-11-2025 12:00:00 AM

  1. జిల్లా పరిషత్ అయినా.. వసతులు కరువాయెనా..?
  2. పట్టించుకోని జిల్లా యంత్రాంగం
  3. వినియోగంలోకి తేవాలంటున్న జనం  

మఠంపల్లి, నవంబర్ 7 : ఆది పేరుకే జిల్లా పరిషత్ అతిధి గృహం అయినా పట్టించుకునే నాధుడు కరువు కావడంతో అది అలంకారప్రాయంగా మిగిలింది. వివరాలలోకి వెళితే జిల్లాలోని మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం  సమీపంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల సౌకర్యార్థం గతంలో ఒక అతిధి గృహాన్ని నిర్మించారు.

దేవాలయం దర్శనానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఈ అతిధి గృహంలోనే సేదతీరే వారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ రాను రాను దాని గురించి పట్టించుకునే వాడే కరువయ్యాడు. దీంతో అతిథి గృహానికి అంధకారం అలుముకొని అలంకారప్రాయంగా మారింది. సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వాలు మారిన అటువైపు ఎవరు కన్నెత్తి చూడకపోవడంతో అది కాస్త ఉపయోగించుకోలేని స్థితికి మారిపోతుంది.

అతిథి గృహం ఆవరణలో కంపచెట్లు, నిరుపయోగమొక్కలు పెద్దవిగా పెరిగి విషసర్పాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.  వసతులు కరువై.. ఉపయోగానికి దూరమై :  అతిధి గృహల్లో వసతులు కరువు కావడంతో దాని ఉపయోగించుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అటువైపుగా ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎవరు వెళ్లలేదు దీంతోని అతిథిగృహం కాస్త నిరుపయోగంగా మారిండి అనడంలో సందేహం లేదు.

ఇక అతిధి గృహానికి కనీసం గేటు, డోర్ ల సౌకర్యం కూడా లేదు. అలాగే నీటి వసతి , లోపల పర్నిచర్  ప్లేకపోవడం వంటి కారణాలతో దానిని అలాగే వదిలేశారు. ప్రస్తుతం కంప, నిరుపయోగ మొక్కలు అతిథి గృహం ఆవరణమంతా అల్లుకుపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు వాటిని తొలగించి, అతిధి గృహంలో అన్ని సౌకర్యాలు కల్పించి, వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

ఉపయోగంలోకి తేవాలి..

లక్షల రూపాయలు వెచ్చించి కట్టిన అతిథి గృహం పూర్తిగా నిరుపయోగంగా మిగిలిపోయింది. దీంతో అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు సీత తీరేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున దీని అభివృద్ధిపై అధికారులు కన్ను పెట్టి ఉపయోగంలోకి తీసుకురావాలి.

 పి.అయ్యప్ప, స్థానికుడు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం..

జిల్లా పరిషత్ అతిధి గృహంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వరకు సౌకర్యాలు కల్పించాం. మరిన్ని సౌకర్యల కోసం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. అదే విధంగా నూతన బిల్డింగ్ కొరకు  ప్రపొజల్ పంపాం. అతిధి గృహంలో సిబ్బందిని కూడా నియమించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

 చంద్రశేఖర్, 

గ్రామ పంచాయతీ కార్యదర్శి, మట్టపల్లి