22-07-2025 09:32:45 PM
ఇల్లెందు/టేకులపల్లి (విజయక్రాంతి): ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కుండపోతగా వర్షం కురియడంతో వాగులు పొంగి ప్రవహించాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులలో ఆనందం వ్యక్తం అవుతుంది. నెల రోజులుగా సరైన వర్షం లేక పోవడంతో విత్తిన విత్తనాలు మొలిచి మండుతున్న ఎండలకు మాడిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం కురిసిన వర్షం రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
ఇప్పటికే పత్తి, మొక్కజొన్న వేలాది ఎకరాల్లో విత్తారు. ఎరువులు, పురుగుమందులు చల్లేందుకు సిద్ధంగా ఉన్న దుక్కులు చేసేందుకు వర్షం లేక ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత వర్షం రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. మరోవైపు సరైన వర్షం కురియక చెరువులు, కుంటల్లోకి సరిపడా నీరు చేరుకోలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీరు చేరుకుంటుందన్న ఆశతో వరి నార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు సిద్ధం చేసుకొని చెరువులు నిండితే వరి నాట్లు వేసేందుకు రెడీగా ఉన్నారు. మంగళవారం కురిసిన వర్షంతో కొన్ని వాగులు పొంగి కొద్దిసేపు ఇబ్బంది కలిగించిన రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది.