calender_icon.png 2 September, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిస్కంలకు భారీ నష్టం!

29-08-2025 03:44:06 AM

  1. నేలకూలిన 1,500 స్థంభాలు, పాడైన 350 ట్రాన్స్‌ఫార్మర్లు
  2. వందల కి.మీ. మేర చెడిపోయిన విద్యుత్ లైన్లు
  3. వరద ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
  4. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీలు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో డిస్కంలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్), ఉత్తర ప్రాంత విద్యు త్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) పరిధిలో సుమారు 1,500 వరకు స్థంభాలు నేలకొరిగాయి. దీనితోపాటు సుమారు 350 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు వరదకు ధ్వంసమయ్యాయి.

వందల కి.మీ. మేర కరెంట్ తీగలు చెడిపోయాయి. యుద్ధప్రాతిపదికన విద్యుత్ పున రుద్ధరణ పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యా రు. రెండు డిస్కంల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, కర్నాటి వరుణ్‌రెడ్డిలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఎస్‌పీడీసీఎల్ పరిధిలో..

ఎస్‌పీడీసీఎల్ పరిధిలో నష్టం ఎక్కువగా జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ము ఖ్యంగా మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్ని సబ్‌స్టేషన్లలోకి నీళ్లొచ్చాయి. 33 కేవీ ఫీడర్లు 11, అలాగే 11 కేవీ ఫీడర్లు 175, డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు 262, విద్యుత్ స్థంభాలు 971 దెబ్బతినడంతోపాటు భారీ గా విద్యుత్ లైన్లు చెడిపోయాయి. మొత్తంగా ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 39 వరకు 33 కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు 296, ట్రాన్స్‌ఫార్మర్లు 280, కరెంట్ స్థంభాలు 1,357 దెబ్బతిన్నాయి.

వరద ఇంకా కొనసాగుతుండ టంతో నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీకి ఇంజినీర్లు తెలిపారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 15  గ్రామాల్లో కరెంట్ నిలిచిపోయింది.  సిబ్బంది రాత్రీపగలు శ్రమించి 10 గ్రామాల్లో విద్యుత్‌ను పు నరుద్ధరించారు. డిస్కం పరిధిలో పరిస్థితిని సీఎండీ ఫారూఖీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే.. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారు. సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు.

ఎన్‌పీడీసీఎల్ పరిధిలో.. 

భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కిళ్ల పరిధిలో నేలకూలిన 108 విద్యుత్తు స్థంభాల్లో 87 స్థంభాలను పునరుద్ధరించినట్టు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. 21 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా 17 పునరుద్ధరించారు. నీటిలో మొత్తం 86 ట్రాన్స్‌ఫార్మర్లు మునిగిపోయాయి. వాటి పునరుద్ధరణకు విద్యుత్తు సిబ్బంది శ్రమిస్తున్నారు.

వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పునరుద్ధరణ పనులకు కాస్త ఆటంకం కలుగుతోంది. దీనికితోడు రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోవడం, రోడ్లపై ఇంకా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో కొన్సిచోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మొత్తానికి రెండు డిస్కంల పరిధిలో విద్యుత్తు శాఖకు భారీగా నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా తేలింది. పూర్తిగా వర్షాలు, వరదలు తగ్గుముఖం పడితేగానీ.. పూర్తి నష్టం ఎంతనేది తెలుస్తుంది.